మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసానికి వచ్చిన ఓ ఫోన్ కాల్ కలకలం రేపింది. దుబాయ్ నుంచి అండర్ వరల్డ్ డాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం.. ముఖ్యమంత్రితో మాట్లాడాలనుకుంటున్నట్లు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడని పోలీసులు వెల్లడించారు. కానీ టెలిఫోన్ ఆపరేటర్ మాత్రం ఈ కాల్ను సీఎంకు బదిలీ చేయలేదని తెలిపారు.
ఫోన్ చేసిన వ్యక్తి... తన వివరాలు తెలియజేయలేదని, ఇబ్రహీం మాట్లాడాలని అనుకుంటున్నట్లు మాత్రమే చెప్పాడని పేర్కొన్నారు పోలీసులు. శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఇలా రెండు సార్లు ఫోన్ వచ్చిందని తెలిపారు.
ఫోన్ కాల్ వ్యవహారాన్ని స్థానిక పోలీసులకు తెలియజేయగా.. ఇంటి చుట్టూ భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేయలేదని... కానీ కాల్ దుబాయ్ నుంచి వచ్చిందా లేక మరేదైనా ప్రదేశం నుంచి వచ్చిందా అని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.